జమ్మికుంట : దళిత బంధుపై బీజేపీ సృష్టిస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. జమ్మికుంటలోని 11,12, 15వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే.. దళిత బంధుపై అవగాహన కల్పించారు. దళిత బంధుపై కొన్ని పార్టీలు సృష్టిస్తున్న వదంతులపై దళితులకు ఎమ్మెల్యే నన్నపునేని వాస్తవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాతకాల రమేశ్, సుగుణ బోగం, బిట్ల కళావతి, వార్డు ఇంచార్జి సయ్యద్ మసూద్, గుండేటి నరేందర్, బత్తుల కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని చెప్పారు. దళిత వర్గాల్లో గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని తెలిపారు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అధికారులు ప్రతీ ఇంటిని సందర్శించి, లబ్దిదారులను గుర్తించి దళిత బంధును అందజేస్తారని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని ఎమ్మెల్యే నరేందర్ స్పష్టం చేశారు.