బదౌన్ : ఉత్తర్ ప్రదేశ్లోని బుదౌన్లో దారుణం జరిగింది. కొత్తగా పెండ్లయిన మహిళ(20)పై భర్త, ఇద్దరు మరుదులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కట్నం విషయంలో భర్త కుటుంబ సభ్యులు కొందరు ఆమెను వేధించినట్టు ఆరోపణలున్నాయి. కొత్వాలి సహస్వన్ ప్రాంతానికి చెందిన మహిళక ఉస్మాన్పూర్ ప్రాంతంలోని వ్యక్తితో ఈనెల 22న వివాహమైంది. ఆపై అత్తింట అడుగుపెట్టగానే భర్త కుటుంబ సభ్యులు ఆమెను కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో భర్త ఇద్దరు మరుదులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించారు.
తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా తన ప్రైవేట్ భాగాలను కాల్చి నరకం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్డ్రింక్లో విషం కలిపి తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అత్తింటి వేధింపులపై సమాచారం అందుకున్న బాధితురాలి తండ్రి పోలీసు బృందంతో కలిసి వెళ్లి ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి భర్తతో సహా నేరానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు.