హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు ఆడటంలో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డిని మించినవారు లేరని.. ఆయన ఫాదర్ ఆఫ్ లయర్స్ అని పబ్లిక్ అకౌంట్స్కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని, రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారని విమర్శించారు. రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీపీసీసీపై కాంగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకను పట్టిందని.. రాష్ట్రం లో ఇక ఆ పార్టీ శకం ముగిసినట్టేనని చెప్పా రు.
బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోడని ధ్వజమెత్తారు. రూ.50వేల కోట్లతో హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ప్రపంచ నగరాల సరసన చేర్చిన ఘనత మంత్రి కేటీఆర్ది అని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతూ దందాలు చేయటానికే పదవులను అడ్డుపెట్టుకున్న చరిత్ర రేవంత్ దని.. ఇక పీసీసీ పదవి పేరుతో రాష్ట్రమంతా దండుకుంటాడని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే పార్టీలో వెల్లువెత్తిన నిరసనలతోనే ఆయన వ్యక్తిత్వమేమిటో తెలిసిపోయిందని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఐరన్లెగ్ అని.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్కూ అదే గతి పట్టిస్తారని ఎద్దేవా చేశారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్మీద రాసిచ్చిన ఎంపీ అరవింద్ నిజామాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.