హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభ పెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. రేవంత్లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదని చెప్పారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించగానే రేవంత్కు భయం పట్టుకున్నదని, అందుకే నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. డబ్బు సంచులతో రాజకీయాలు చేయాలనుకుంటే అంతకంటే నీచమైన బతుకు మరొకటి ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితపై మాట్లాడే నైతికహక్కు రేవంత్కు లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కనుసైగ చేస్తే చాలు లక్షలమంది తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్రెడ్డిని రోడ్ల మీదకు కూడా రానివ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రేవంత్కు దళితులంటే చిన్నచూపు అని, ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే గురుకులాలను తీర్చిదిద్దారని.. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటివాళ్లు దళితబంధును విమర్శించటం సిగ్గుచేటని చెప్పారు.
బ్లాక్మెయిలింగ్ ఆటలు సాగవు: ఎమ్మెల్యే సైదిరెడ్డి
రేవంత్రెడ్డి బ్లాక్మెయిలింగ్ ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రేవంత్ దిగజారుడు భాషతో తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఊగిపోతున్నదని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అయిన సోనియాగాంధీ.. నేడు తెలంగాణ తల్లి ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. రేవంత్కంటే వందరెట్లు ఎక్కువగా తిట్టగలమని.. కానీ తమకు సీఎం కేసీఆర్ సంస్కారం నేర్పించారని చెప్పారు. కాంగ్రెస్లో హైలైట్ కావటానికే సభ పెట్టారు తప్ప.. గిరిజనులను ఉద్ధరించడానికి కాదని అన్నారు.