హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతిలో దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఏడేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణలో దళితుల అభివృద్ధి, సంక్షేమానికి రూ.55 వేల కోట్లు ఖర్చుచేయటం అసాధారణమన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, కాలె యాదయ్య, నోముల భగత్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ దళిత సాధికారిత స్కీంను ప్రారంభించటంపై రాష్ట్రంలోని దళిత జాతి పాలాభిషేకాలతో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అట్టడుగున ఉన్న వంద దళిత కుటుంబాలను ఎంపికచేసి నేరుగా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయటం ద్వారా 11,900 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని చెప్పారు. దళిత సాధికారతపై సీఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని కొనియాడారు. భూమిలేని నిరుపేద దళితులకు రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలుచేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్పదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రెండురోజులు దళితవాడల్లో నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని సీఎం ఆదేశించినట్టు సుమన్ తెలిపారు. సామాజిక సమస్యల నుంచి దళితులకు విముక్తి కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడేండ్లలో దళితులకు ప్రభుత్వం 16 వేల ఎకరాలను ఉచితంగా పంపిణీ చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ఫండ్ను తెచ్చి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
దళితుల్ని నిలువునా ముంచిన బీజేపీ, కాంగ్రెస్
దళితులను బీజేపీ ఎన్నడూ పట్టించుకోలేదని, ఆ పార్టీది దళిత వ్యతిరేక భావజాలమేనని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. దళితులు ఎదిగితే తమ ఆటలు సాగవన్న ఆలోచనతో వారిని ఎదగనీయకుండా బీజేపీ కుట్ర చేస్తున్నదని, అందులో భాగంగానే వర్సిటీల్లో పరిశోధనలు చేసే దళిత విద్యార్థులకు స్కాలర్షిప్స్లు ఇవ్వటంలేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై తరచుగా దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. దళితుల్ని ఓటుబ్యాంకుగా వాడుకొంటున్న కాంగ్రెస్ పార్టీ.. వారి అభ్యున్నతి కోసం ఎన్నడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు. దళితుల పట్ల కాంగ్రెస్కు ప్రేమ ఉంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాంగ్రెస్ ‘మునుగుతున్న నావ’ అని, ఎవరు పీపీసీ ప్రెసిడెంట్ అయినా ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదన్నారు. దళితులగురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదని బాల్క సుమన్ చెప్పారు.
ప్రజల మదిలో సీఎం దేవుడు
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. దళితులను ఓటుబ్యాంక్గా వాడుకొంటున్న బీజేపీ, కాంగ్రెస్లకు టీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్పై మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ దళితుల కోసం దేశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనన్నారు. ఉద్యమనేతగా, బంగారు తెలంగాణ రూపశిల్పిగా ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మిషన్ కాకతీయ, భగీరథ, రైతుబంధు పథకాల మాదిరిగా దళిత సాధికారత పథకానికి గొప్ప పేరు వస్తుందని, సీఎం కేసీఆర్కు దళితజాతి రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు. దళితులకు ప్రేమను పంచిన సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడని ఎమ్మెల్యే కాలె యాదయ్య కీర్తించారు.