మహబూబ్నగర్, జూలై 15: అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ టీఆర్ఎస్ అని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఏం చేశారో చెప్పిన తరువాతే బీజేపీ నాయకులు యాత్రలు చేయాలన్నారు. తెలంగాణలో చేపడుతున్న మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.500 కోట్లు ఇవ్వాలని నీతిఅయోగ్ ప్రతిపాదనలు పంపినా.. కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పన్నుల రూపంలో అత్యధికంగా కేంద్రానికి చెల్లిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆగ్రో ఇండస్ట్రీలను తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 55 వేల సభ్యత్వాల నమోదు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. ఈనెల 20లోగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసి ఆన్లైన్ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఆగస్టు ఒకటి నుంచి ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు.