కోల్కతా, మార్చి 12: గాయపడ్డ సింహం శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈ ఉపమానం కచ్చితంగా సరిపోలుతుంది. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ జీవితంలో మమతపై ఎన్నో దాడులు జరిగాయి. కొన్నిసార్లు ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. అయితే ఆ దాడులు ఆమెను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. బుధవారం మమతపై దాడి నేపథ్యంలో పలువురు ఈ విషయాలను గుర్తు చేస్తున్నారు.1990లో సీపీఎం యూత్ లీడర్ ఒకరు మమత తలపై కర్రతో బలంగా కొట్టారు. 1993లో ఓ బాలికపై అత్యాచారం వ్యవహారంలో సీపీఎం నేతకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన కార్యక్రమంలో మమతను పోలీసులు విపరీతంగా కొట్టారు. 2000-01 సంవత్సరంలో మమత వాహనంపై బాంబు దాడి జరిగింది. 2007లో దుండగులు మమత కారును కాల్చివేశారు.
మమత ఎస్ఎస్కేఎం దవాఖాన నుంచి శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల పర్యవేక్షణ అవసరం అని వైద్యుల బృందం సూచించినప్పటికీ మమత ఇంటికి వెళ్లడానికే మొగ్గుచూపారని వైద్యులు తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 12: పశ్చిమబెంగాల్లో బొగ్గు గనుల అక్రమ తవ్వకాల కేసులో తృణమూల్ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమీపబంధువు అంకుశ్ అరోరాకు సీబీఐ నోటీసులు పంపించింది. అంకుశ్ తన తండ్రి పవన్ అరోరాతో కలిసి సోమవారం దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే అభిషేక్ భార్య రుజీరా, మరదలు మేనకను ప్రశ్నించింది. ప్రస్తుతం మేనక భర్త అంకుశ్కు నోటీసులిచ్చారు. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు గనుల అక్రమ తవ్వకాల్లో మమత బంధువుల ప్రమేయం ఉన్నదని సీబీఐ ఆరోపిస్తున్నది.