ముంబై: ఒక బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఈ ఘటన జరిగింది. భర్త నుంచి దూరంగా ఉంటున్న 40 ఏండ్ల మహిళ తన 15 ఏండ్ల కుమార్తెతో కలిసి ఉల్హాస్ నగర్ క్యాంప్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. కాగా, కుమార్తె స్థానిక జీన్స్ ప్యాక్టరీలో పని చేస్తున్నది. అక్కడ 19 ఏండ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే యువతి తల్లి వీరిద్దరి ప్రేమను నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని వార్దిదరు నిర్ణయించారు.
ఈ నెల 21న మధ్యాహ్నం కుమార్తె ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చింది. ఆమె తలుపు తెరిచి ఉంచగా లోనికి వచ్చిన ప్రియుడు వంట ఇంట్లో ఉన్న బాలిక తల్లిని కత్తితో పొడిచాడు. అనంతరం వారిద్దరు ఫ్యాక్టరీకి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలిక తన తల్లి హత్యకు గురినట్లు స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు కుమార్తెపై అనుమానంతో ప్రశ్నించగా జరిగిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో ఆ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ అయిన బాలికను హోమ్కు తరలించారు.