హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది ఫేక్ చార్జ్షీట్ అని పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి కొట్టిపారేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్కాదని, ఆయన రవ్వంతరెడ్డి అని ఎద్దేవా చేశారు. రేవంత్వి పచ్చి అబద్ధాలని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తగినశాస్తి తప్పదని హెచ్చరించారు. శనివారం తెలంగాణభవన్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడని తెలిసిపోయాక తన బలం చాలటంలేదని ఢిల్లీ నుంచి నేతల్ని తెప్పించుకొని సభలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఐటీరంగం పురోగమిస్తున్నదని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వాస్తవాలు చెబితే జీర్ణించుకోలేక ఆయనను గాడిదతో సంబోధించిన కుసంస్కారి రేవంత్ అని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను సృషించిందే కాంగ్రెస్ అన్న సంగతి రేవంత్ మరచిపోవడం దురదృష్టకరమని చెప్పారు. రేవంత్రెడ్డి బటన్ చంద్రబాబు చేతిలో ఉన్నదని, రేపు కాంగ్రెస్లో ఎవరికి సీట్లు ఇవ్వాలన్నా చంద్రబాబే ఫైనల్ చేస్తాడని అన్నారు. బీజేపీ నేతలు సెప్టెంబర్ 17 గురించి రాద్ధాంతం చేస్తున్నారని, తెలంగాణకు నిజమైన విముక్తి 2014 జూన్ 2న లభించిందని చెప్పారు.
కాంగ్రెసోళ్లే తిట్టుకుంటున్నారు: ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
రేవంత్రెడ్డి గజ్వేల్లో సభ ఎందుకు పెట్టా రో అర్థం కావటంలేదని కాంగ్రెస్ వాళ్లే తిట్టుకుంటున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ సభకు వచ్చినవారు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపి ఆశ్చర్యపోయారని చెప్పారు. గజ్వేల్ను సింగపూర్లా మార్చిన తీరును చూసి సంబురపడ్డారన్నారు. గజ్వేల్లో ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడేం లేదని రేవంత్రెడ్డి పిచ్చొడిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులే తిట్టుకుంటున్నారని తెలిపారు.
అతనో డ్రామా ఆర్టిస్ట్: వంటేరు
రేవంత్రెడ్డి అంటేనే డ్రామా ఆర్టిస్ట్ అని వం టేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. రేవంత్ నిజస్వరూపం తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. నెలరోజులుగా రాష్ట్రమంతా తిరిగి.. బతిలాడి జనాన్ని తెచ్చుకున్నారని, ఆ సభలో గజ్వేల్ వాసులు ఎవరూలేరని తెలిపారు. గజ్వేల్ సభాప్రాంగణం 8 ఎకరాలేనని, అందులో రెండున్నర లక్షల మంది ఎట్లా పడతారని ప్రశ్నించారు. అంతమంది వచ్చారని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ పథకాలను విమర్శించే కాంగ్రెస్ నేతలకు నైతికత ఉంటే వాటిని తీసుకోకుండా ఉండాలని హితవుపలికారు.
భాష మార్చుకోకుంటే తరిమి కొడతారు: బాలమల్లు, మారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను మరోసారి అసభ్యపదజాలంతో మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్ను టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. భాష మార్చుకోకపోతే ప్రజలే తరిమికొట్టే రోజులు వస్తాయని స్పష్టంచేశారు. గజ్వేల్ సభలో సీఎం కుటుంబంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం వారు ఒక ప్రకటనలో ఖండించారు. సొంత పార్టీ నేత, ఓ ఎంపీని గాడిద అని తిట్టడం రేవంత్ నీచ సంస్కారానికి అద్దం పడుతున్నదని విమర్శించారు. సీఎంను తిట్టడం వల్ల హీరో అవుతానని పగటి కలలుకంటున్నాడని, రేవంత్ ఎప్పుడూ జీరోగానే ఉంటాడని పేర్కొన్నారు. గజ్వేల్లో రాత్రిపూట మీటింగ్ పెట్టడం కాదు, పగటిపూట వెళ్లి అభివృద్ధిని చూసి మాట్లాడాలని సవాల్ విసిరారు.