యాదాద్రి: తెలంగాణ వైభవం యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు, వారి కుటుంబ సభ్యులు కలసి కిలో బంగారం డొనేట్ చేస్తామని ప్రకటించారు.
ఆరుగురు నేతలు కలిసి మొత్తంగా ఆరు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఒక గొప్ప కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములం అవుతామని ఈ నేతలు పేర్కొన్నారు. విరాళం ప్రకటించిన వారిలో ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఉన్నారు.
వీరే కాకుండా సిద్దిపేట ప్రజలందరి తరఫున ఆలయ గోపురం స్వర్ణతాపడం కోసం కేజీ బంగారం అందిస్తామని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఎమ్మేల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా ఆలయ స్వర్ణగోపురం కోసం 2 కేజీల బంగారం, ఆలయం ప్రాంగణంలో నిర్మించే కాటేజ్ నిర్మాణం కోసం రూ.2 కోట్లు అందిస్తానని వెల్లడించారు.
మంగళవారం ఉదయం నుంచి యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. మహా సుదర్శన యాగంతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆలయంలో గోపురానికి స్వర్ణతాపడం చేస్తామని ప్రకటించారు.