పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ను పోలీసులు రెండోరోజు ఆదివారం కూడా విచారించారు. సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, వెంకటనాగమణి హత్యకేసులో ప్రమేయంపై ఆరాతీశారు. వామనరావు తండ్రి కిషన్రావు ఫిర్యాదు మేరకు న్యాయవాద దంపతుల హత్య రూ.2 కోట్ల సుపారీతో జరిగిందని, పుట్ట మధూకర్, శైలజతోపాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహకరించారని ఆరోపించడంతో ఆ దిశగా పోలీసులు విచారణను ముమ్మరంచేశారు. 41 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం మధూకర్ సతీమణి శైలజకు నోటీసులు ఇచ్చారు. హత్యకు పాల్పడ్డ నిందితులతో పుట్ట మధూకర్, శైలజకు ఉన్న సంబంధంపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. వారు నిందితులతో జరిపిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా సేకరించే పనిలో ఉన్నారు. సుపారీ ఆరోపణల నేపథ్యంలో జడ్పీ చైర్మన్, భార్య శైలజ, కొడుకు, కోడలు, కూతురు, ఇతర కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరుల బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను కూలంకషంగా పరిశీలించేందుకు బ్యాంకులకు లేఖలు రాశారు. హత్యకు రెండు నెలల ముందు, రెండు నెలల తర్వాత జరిగిన లావాదేవీల సమాచారం ఇవ్వాలని 14 బ్యాంకులను లేఖల్లో కోరారు. సోమవారం ఆ వివరాలు వచ్చే అవకాశం ఉన్నది. బిట్టు శ్రీనివాస్ కారు కొనుగోలు వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఏ-1 నిందితుడు కుంట శ్రీను, ఏ-6 నిందితుడు బిట్టు శ్రీనివాస్కు సంబంధించిన ఇండ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయన్న విషయమై ఆరా తీస్తున్నారు. తాజాగా కిషన్రావు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరుల ప్రమేయంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయనను పిలిపించి వివరాలు సేకరించారు. రామగుండం పోలీసు కమిషనరేట్లో సెక్యూరిటీ వలయంలో కమిషనర్ సత్యనారాయణ, విచారణ అధికారి, అడిషనల్ డీసీపీ అశోక్కుమార్, ఓఎస్డీ శరత్చంద్ర పవార్ ఈ విచారణ కొనసాగిస్తున్నారు. వారంపాటు అదృశ్యమైన పుట్ట మధూకర్ ఎక్కడ ఉన్నారు, ఎవరెవరితో ఉన్నారు, ఎందుకు అదృశ్యమయ్యారన్న వివరాలను సేకరిస్తున్నారు. వారంపాటు సోదరుడు సత్యనారాయణ, స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాస్రావుతో ఎక్కడెక్కడ గడిపారనే విషయమై వారిని సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న పుట్ట మధూకర్ను ఆయన కొడుకు, కోడలు, కుమార్తె పరామర్శించి వెళ్లారు.