నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో సాగుతున్న తెలంగాణపై తోడేళ్ల మాదిరిగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ తోడేళ్ల వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఎన్ని అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా వారికి అధికారం పగటి కలేనన్నారు. శనివారం నల్లగొండలోని తన నివాసంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడా రు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నదని, ఏ లోటూ లేకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బ్రహ్మాండమైన పాలన సాగుతున్నదన్నారు.
అలాంటి రాష్ట్రం మీద బీజేపీ నాయకులు అధికార దాహంతో వివిధ పేర్లతో యాత్రలు చేస్తూ అబద్ధపు ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పూర్తి అవాస్తవాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాలన వందకు వంద శాతం విఫలమైందని, ఏ దేశమూ చేయనన్ని అప్పులు చేస్తున్నదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయని, డీజిల్, పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటాయని, గ్యాస్ ధర వెయ్యికి చేరిందని, ఇలాంటి వాటిపై కిషన్రెడ్డి మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశంలోనైనా తెలంగాణకు న్యాయం చేయకపోగా.. కృష్ణా, గోదావరి జలాలపై హక్కులను కేంద్రం లాక్కుంటున్నా బీజేపీ నేతలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఏపీలో అక్రమాస్తుల కేసులు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో ఎ లా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఎస్సీల అసైన్డ్ భూములను తీసుకున్నట్టు స్వయంగా ఒప్పుకున్న ఈటల రాజేందర్ను పార్టీకిలోకి ఎలా తీసుకున్నారని నిలదీశారు. హైదరాబాద్లో తాలిబన్లు ఉన్నారంటూ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించడమంటే కేంద్ర పరిధిలోని ఎన్ఐఏ పనితీరును అవమానించినట్లేనన్నారు. కేవలం మత విద్వేషాలతో రాజకీయ లబ్ధిపొందాలన్న ఏకైక లక్ష్యంతోనే బీజేపీ పనిచేస్తున్నదని దుయ్యబట్టారు.
ఇవన్నీ పక్కకు పెట్టి బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలు అధికారంపై పగటి కలల్లో మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు దళిత దండోరా పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అప్పుడే డబ్బుల కోసం కొంతమంది కాంట్రాక్టర్లను దబాయించడం మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటోళ్లకు అధికారం అప్పగిస్తే చార్మినార్ను సైతం అమ్మేస్తారని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి రావా లి? ఎప్పుడు దోచుకోవాలి? అన్న దుర్బుద్ధి తప్ప విపక్షాలకు మరో యావ లేదన్నారు.