కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్ గ్రహించాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధిక మాట్లాడారు. ఈటల రాజేందర్ గత మూడు రోజులుగా తన అనుచరులను కొంతమంది నాయకుల వద్దకు పంపి డబ్బులు ఆశ చూపి తన వైపు లాక్కోవాలనుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈటల ప్రలోభాలకు లొంగే వారేవరూ లేరని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ భవిష్యత్ను ఇచ్చిన సీఎం కేసీఆర్ను ఈటల విమర్శించడం సరికాదన్నారు. తనకు 200 ఎకరాల భూమి ఉందని, ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికను ఎదుర్కొంటానని ఈటల ప్రకటించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని గందే రాధిక స్పష్టం చేశారు.