తిరుప్పూర్: ఈ రోజుల్లో పెళ్లిళ్లకు, పేరంటాలకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న సంగతి తెలుసు కదా. భారీ సెట్టింగులు, రకరకాల ఫుడ్, ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్స్ అంటూ మధ్య తరగతి జీవులు కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ తమిళనాడులోని ఓ జంట మాత్రం ఈ కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్గా ముగించుకొని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇవ్వడం విశేషం. అను, అరుల్ ప్రాణేశ్ అనే ఆ వధూవరులు మొదట తమ పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు.
కానీ లాక్డౌన్ మధ్య ఈ నెల 14న జరిగిన వాళ్ల పెళ్లికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో ఆ మిగిలిన రూ.37 లక్షలను రాష్ట్రంలో పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. కొవిడ్ భయం కారణంగా చాలా మంది ఆహ్వానితులు రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తాము ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ చెప్పాడు.
ఈ పరిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయకూడదని పెద్దలు నిర్ణయించారని, దీంతో తాము వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. స్థానిక అధికారుల అనుమతితో చాలా కొద్ది మంది సమక్షంలో పెళ్లి జరిగినట్లు తెలిపాడు. చారిటీ పని చేసే స్థానిక తిరుప్పూర్ వెస్ట్ రోటరీ క్లబ్లో సభ్యులైన కుటుంబం కావడంతో ఆ సంస్థకు మిగిలిన డబ్బును విరాళంగా ఇచ్చేశారు.