టీఆర్ఎస్ సీనియర్ నేత పరిపాటి రవీందర్రెడ్డి
జమ్మికుంట, మే 8 : టీఆర్ఎస్ కన్నతల్లిలాంటిదని, పార్టీలో ఉంటూ ఎవరో మెప్పుకోసం విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్రెడ్డి, నాయకులు హెచ్చరించారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు రెండు కండ్లలాంటి వారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే నాయకులు రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ అన్నివర్గాలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్వార్థం కోసం రాజకీయాలు చేసే నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.