కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, యాజమాన్యాల భద్రత, శ్రేయస్సుపై రాజీ పడేదిలేదని స్పష్టం చేసిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎలాగైన టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉన్న కొన్ని జట్లు లీగ్ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ఆ దిశగా అడుగులు వేశాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ముందు వరసలో ఉన్నాయి.
ఈ రెండు టీమ్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ మరో రెండు, మూడు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్ బెర్తు ఖరారు అయ్యేది.
బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్లో అలవోకగా ప్లే ఆఫ్కు అర్హత సాధించేలా కనిపించాయి. అనూహ్యంగా కరోనా దెబ్బకు లీగ్ను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత పాయింట్ల ప్రకారం ఢిల్లీ 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఇక ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం రెండు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. డేవిడ్ వార్నర్ను కెప్టెన్గా తప్పించి అతని స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన కేన్ విలియమ్సన్ కూడా టీమ్ను గెలిపించలేకపోయాడు. రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. కొవిడ్ వల్ల రద్దైన ఈ ఏడాది సీజన్ను ఢిల్లీ ఘనంగా ముగించగా.. చెత్త ప్రదర్శనతో సన్రైజర్స్ నిరాశనే మిగిల్చింది.