మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి కారణాలు మన మూత్రపిండాల పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. క్రమంగా కిడ్నీలు వైఫల్యం వైపుగా అడుగేస్తాయి. మన దేశంలో 40 ఏండ్లకు పైబడిన ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. డయాలసిస్తో లక్షలాది మంది తమ బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ‘కిడ్నీ మార్పిడి’ శస్త్రచికిత్సలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కిడ్నీదానంపై పెద్దగా అవగాహన లేకపోవటం, శస్త్రచికిత్స గురించిన అపోహలూ దీనికి ప్రధాన కారణం.
రక్తాన్ని వడపోసి, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపడంలో మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఒకవేళ కిడ్నీలు పూర్తిగా పనిచేయని పరిస్థితే కనుక వస్తే, దాన్ని ‘కిడ్నీ ఫెయిల్యూర్’ అంటారు. ఫలితంగా వ్యర్థాలు పేరుకుపోయి రక్తంలో క్రియాటిన్, యూరియా వంటివి ఎక్కువైపోయి శరీరం విషతుల్యమవుతుంది. అంతిమంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్లో ‘తాత్కాలికం’, ‘శాశ్వతం’ అని రెండు రకాలు. వడదెబ్బ, డయేరియా, కలరా, మందుల దుష్ప్రభావం వంటివి మొదటి రకం కిందికి వస్తాయి. చికిత్సతో రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీన్ని ‘ఎక్యూట్ కిడ్నీ ఇన్జ్యురీ’ అంటారు. ఇక్కడకూడా డయాలసిస్ అవసరం కావచ్చు. కానీ, రోగి కోలుకోగానే ఆపేస్తారు. ‘శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్’ అనేది ప్రమాదకరం. మందులు, ఇతర చికిత్సలవల్ల పూర్తి సాధారణ స్థితి సాధ్యపడదు. ఈ దశలో రెండే దారులు: ఒకటి డయాలసిస్ కాగా, రెండోది కిడ్నీ మార్పిడి. అధికశాతం పేషెంట్లు డయాలసిస్ తీసుకుంటారు. కిడ్నీలు 90 శాతం చెడిపోయి 10 శాతం బాగున్నా డయాలసిస్ ద్వారా వైద్యం అందిస్తాం. వందశాతం చెడిపోతే మాత్రం, కిడ్నీ మార్పిడికి వెళ్లాల్సిందే.
డయాలసిస్ ద్వారా..
చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. డయాలసిస్ అనేది కిడ్నీలకు చేసే చికిత్సకాదు, కిడ్నీలు చేసే పనినే డయాలసిస్ ద్వారా చేయడమని అనుకుంటారు. డయాలసిస్ చేస్తే పరిస్థితి మెరుగు పడుతుందనీ భావిస్తారు. ‘శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్’ పేషెంట్లలో ఇది సాధ్యపడదు. ఒరిజినల్ కిడ్నీలు చిన్నచిన్న వ్యర్థాలనుంచి పెద్దపెద్ద మలినాలవరకూ లక్షా 20 వేల డాల్టన్స్ వరకు తీసివేయగలవు. కానీ, డయాలసిస్ మిషన్ద్వారా 2 వేల డాల్టన్స్ వరకు మాత్రమే తీయడం సాధ్యమవుతుంది. కొత్తగా వచ్చిన ‘హీమో డయా ఫిల్ట్రేషన్’వల్లకూడా 60 వేల డాల్టన్స్ని మాత్రమే తొలగించగలం. డయాలసిస్ద్వారా సాధారణ కిడ్నీల పనిలో 20-25 శాతం మాత్రమే చేయగలం. మిగతా మలినాలు అలాగే మిగిలిపోతాయి. అవి క్రమంగా పేరుకుపోయి గుండె బలహీన పడుతుంది, రక్తనాళాలు గట్టి పడతాయి. దీంతో పక్షవాతమూ రావచ్చు.
దాతలూముందుకు రండి!
మనకు రెండు కిడ్నీలు ఉన్నాయి. వాటి సామర్థ్యం మన శరీర అవసరానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. జీవితాంతం హాయిగా బతికేందుకు ఒక కిడ్నీలో సగం సామర్థ్యం ఉన్నా సరిపోతుంది. ఒక కిడ్నీ తీసి వేసినా, బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ కూడా మారదు. ఒక్క కిడ్నీతో శరీరం పూర్తి క్రియలు నిర్వహించుకుంటుంది. ప్రస్తుతం కొద్దిమంది రోగులకు మాత్రమే ‘కిడ్నీమార్పిడి’కి అవకాశం ఉంటున్నది. ఎంతోమంది ఆ అవకాశం లేక రెండు-మూడేండ్లలోనే ప్రాణాలు వదులుతున్నారు. ‘కిడ్నీదానం’ విషయంలో ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదు. ధైర్యంగా ముందుకు రావాలి. దీనికోసం ప్రత్యేకించి ‘ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్’ ఉంది. న్యాయ, వైద్య పరమైన కోణాలు పరిశీలించాకే ‘కిడ్నీమార్పిడి’ సాధ్యమవుతుంది. చట్ట ప్రకారం తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, పిల్లలు కిడ్నీదానాలు చేయవచ్చు. ఆ అవకాశం లేకుంటే, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అయిన పిన్ని, బాబాయ్, అత్త, మామ ఇవ్వవచ్చు. వీరు ‘తెలంగాణ ఆథరైజేషన్’ కమిటీకి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలి. ఈ అవకాశం కూడా లేనివారు ‘జీవన్దాన్’ద్వారా కిడ్నీదాత కోసం ఎదురుచూడాలి. రక్తం మ్యాచ్ కాకున్నా, నేను 2011లోనే తొలిసారి అపోజిట్ బ్లడ్ గ్రూప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను. అయితే, ఇందులో రిస్క్ ఉంటుంది. ఎంతో జాగ్రత్త అవసరం. స్వీడన్, యూరప్, జపాన్ వంటి దేశాల్లో ఎప్పటినుంచో చేస్తున్నారు.
ఒక కిడ్నీ చాలు
ఒక కిడ్నీ అమర్చినా చాలు. క్రియాటిన్ నార్మల్ అవుతుంది. చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. బైకులు నడుపవచ్చు. పెండ్లిళ్లు చేసుకోవచ్చు. ‘కిడ్నీమార్పిడి’ చేసుకున్న మహిళల్లో పిల్లల్ని కన్నవారుకూడా ఉన్నారు. వందమందికి కిడ్నీమార్పిడి చేస్తే, పదేండ్ల తర్వాత 80మంది వరకూ బాగానే ఉంటున్నారు. అదే డయాలసిస్ చేసుకున్న అయిదేండ్లలో వందకు 20 మంది మాత్రమే బతుకుతున్నారు. మార్పిడి చేసుకున్న తర్వాత కిడ్నీ ఫెయిల్ అయితే, మళ్లీ ‘కిడ్నీమార్పిడి’ చేయించుకోవచ్చు. అదే ఈ చికిత్సలోని గొప్పతనం.
‘మార్పిడి’ మంచి పరిష్కారం
అంతర్జాతీయ గణాంకాల ప్రకారం, డయాలసిస్ మొదలుపెట్టిన మూడు సంవత్సరాల లోపు ప్రతి వందమంది పేషెంట్లలో సగం మంది ప్రాణాలతో ఉండటం లేదు. మరో ఐదేండ్లలో 70నుంచి 80శాతం మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులూ, గుండె సమస్యలూ ఉన్నవారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు, వయోధికులు త్వరగా మరణిస్తున్నట్లు తెలుస్తున్నది. అరుదైన సందర్భాల్లో, పదేండ్లనుంచీ డయాలసిస్ చేసుకుంటున్న రోగులూ సజీవంగానే ఉంటున్నారు. కాకపోతే, వారి జీవితం మొత్తం హాస్పిటల్స్ చుట్టూ తిరగటమే అవుతున్నది. వందశాతం కిడ్నీలు చెడిపోయి డయాలసిస్తోనే ప్రాణం నిలబెట్టుకుంటున్న వారికి ‘కిడ్నీమార్పిడి’ మంచి ప్రత్యామ్నాయం. కాకపోతే, కిడ్నీదాతలు దొరకాలి.
భయాలు వద్దు
40 ఏండ్ల క్రితం రక్తదానం అంటే ఎంతో భయపడేవారు. ఇప్పుడు రక్తదానం చేసేందుకు లక్షలాది మంది ముందుకు వస్తున్నారు. అలాగే, ‘కిడ్నీదానం’పైనా అనేక అపోహలున్నాయి. ఒక చిన్న సర్జరీద్వారా దాతనుంచి కిడ్నీని సేకరించి, పేషెంటుకు అమర్చుతారు. కిడ్నీదానం తర్వాత దాతకు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అన్ని పరీక్షలూ చేసిన తర్వాతే, దానానికి అనుమతిస్తారు. దీర్ఘకాలిక రోగాలుంటే అనుమతించరు. ఒకర్ని బలి చేసి, మరొకరి ప్రాణాలు కాపాడటం వైద్యవృత్తి స్ఫూర్తికి విరుద్ధమని అందరూ గుర్తించాలి. పొద్దున సర్జరీ చేస్తే, సాయంత్రానికి దాతను నడిపిస్తాం. మూడు, నాలుగు రోజుల్లో డిశ్చార్జి చేస్తాం. ముందు జాగ్రత్తగా రెండు నెలలు బరువులు మోయవద్దని చెబుతాం. ఆ తర్వాత ఆ వ్యక్తి మునుపటిలాగే అన్ని పనులు చేసుకోవచ్చు.
ఆలస్యం చేయకండి
మధుమేహం కారణంగానే 40నుంచి 50శాతం మంది డయాలసిస్ పేషెంట్లుగా మారుతున్నారు. అయితే, 90 శాతం మందిలో ప్రాథమిక దశలో వ్యాధి లక్షణాలు కనిపించవు. జబ్బు ముదిరాక, కిడ్నీలు దాదాపుగా చెడిపోయాక మాత్రమే లక్షణాలు బయటపడతాయి. వికారం, నీరసం, కాళ్లూ-మొహం వాపులు, ఆకలి తగ్గటం, నిద్ర దెబ్బ తినడం, చర్మం రంగు మారడం, తీవ్ర ఆయాసం లాంటి లక్షణాలు ఉంటాయి. కిడ్నీ సమస్య ఉందా లేదా అన్నది ప్రాథమిక దశలోనే చెప్పడం కష్టం. కానీ, ఒక విషయం గుర్తుంచుకోవాలి. షుగర్, బీపీ, స్థూలకాయం, సిగరెట్, మద్యం అలవాటు ఉన్నవారు, కుటుంబసభ్యుల్లో ఎవరైనా కిడ్నీ సమస్యలు, సోరియాసిస్, కీళ్లవాతం వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. పెయిన్ కిల్లర్లు అధికంగా వాడటం వల్లకూడా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయాల్లో ఎక్కువగా మూత్రానికి వెళ్లడం, కాళ్లవాపులు, మూత్రంలో రక్తం, నురగ, చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి లక్షణాలుంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ కమల్ కిరణ్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్