టీఆర్ఎస్ ఫ్లెక్సీ చింపిన ఎంపీ అర్వింద్

- చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై క్రిమినల్ కేసులు పెట్టాలని టీఆర్ఎస్ నేతలు డీజీపీ ఎం మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం టీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్తోపాటు న్యాయవాదులు కల్యాణ్రావు, లలితారెడ్డి, చంద్రశేఖర్రావు, మల్లేశ్ తదితరులు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలో నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ అద్దె చెల్లించి హోర్డింగ్లు, యూనిపోల్స్, బస్షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై ఫ్లెక్సీలను ఏర్పాటుచేసిందని తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద పెట్టిన టీఆర్ఎస్ ఫ్లెక్సీని అర్వింద్ తన పార్టీ కార్యకర్తలతో ధ్వంసం చేయించారని, తాను కూడా స్వయంగా చించేశాడని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలను చించడంతోపాటు నగరంలో శాంతిభద్రతలు అదుపుతప్పేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.