నల్లగొండ : పార్టీ సభ్యత్వంలేని వారు కమిటీ సభ్యులుగా అర్హులుకాదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏక నాయకత్వంలోనే కార్యకర్తలు పనిచేయాలని స్పష్టం చేశారు.
గ్రూపు రాజకీయాలను టీఆర్ఎస్ పార్టీ సహించబోదని ఆయన తెలిపారు. పార్టీలో సభ్యత్వం లేనివారు నిర్వహించే కార్యక్రమాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాయకత్వంలోనే టీఆర్ఎస్శ్రేణులు పనిచేయాలని తెలిపారు.
పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను దెబ్బదీసే ప్రయత్నం చేసేవారిపై చట్టపరమైన చర్యలను కూడా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, రామన్నపేట సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, రామన్నపేట మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి, నార్కట్ పల్లి మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.