నల్లగొండ : నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన రెండు చోట్లా బ్యాలెట్ లేకుండా మార్గం సుగమం అయింది.
జనరల్ బ్యాలెట్లో ఉన్న నాలుగు డైరెక్టర్లకు గాను మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మహిళా బ్యాలెట్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయిన వనిపాకల పాల సొసైటీ చైర్మన్ కర్నాటి జయశ్రీ, యాదగిరిగుట్ట మండలం మహబుబ్ పేట గ్రామ సొసైటీ చైర్మన్ కందాల అలివేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న వారిలో గూడూరు శ్రీధర్ రెడ్డి,కోట్ల జలందర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహా రెడ్డి ఉన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి అభినందన..
ఇదిలా ఉండగా మహిళా బ్యాలెట్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థినిలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి లతో కలసి ఆయన వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.