లక్నో: తల్లిదండ్రుల ఎదుటే వారి కుమార్తె అయిన 16 ఏండ్ల బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ దారుణం జరిగింది. అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, పొరుగింటి అమ్మాయి కలిసి జూన్ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో జూన్ 29న మహిళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఒక ఇంటికి తీసుకెళ్లారు. వారిద్దరు లేచిపోవడానికి 16 ఏండ్ల బాలిక కారణమని అనుమానించి ఆమెను కొట్టారు. కనిపించకుండా పోయిన మహిళ సోదరులు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ప్రతీకారంతో బాలిక తల్లిదండ్రుల ఎదుటే ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒక నిందితుడు ఆమెను బలవంతంగా పెండ్లి చేసుకున్నాడు.
ఆ మరునాడు బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను వారు విడిచిపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే హత్య చేస్తామని హెచ్చరించారు. కాగా, బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తొలుత ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.