ఇల్లందకుంట సెప్టెంబర్ 27: బీజేపీ నేత ఈటల రాజేందర్కు చిత్తశుద్ధి లేదని.. మంత్రిగా ఉండీ ఏం చేయలేకపోయాడని, నమ్మి ఓటేసిన ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలతో రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలతో పేదల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సంక్షేమం వైపు నడిపిస్తుంటే, బీజేపీ సంక్షోభం వైపు తీసుకెళ్తున్నదని.. మీకు ఎవరు కావాలో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం ఇంటింటిప్రచారం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉద్ఘాటించారు. దళితులకు దళితబంధు, రైతులకు రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలు పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నాయని స్పష్టంచేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాల ను ఎందుకు అమలు కావడంలేదని ప్రశ్నించారు. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగ కల్పన, అభివృద్ధే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బీర్ల విజయకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొంరెల్లి, గ్రామ ఇంచార్జీ దేవన్న తదితరులు పాల్గొన్నారు.