భారతీయులు నిత్యం తాము చేసుకునే అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటారు. కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే ఏ కూర అయినా సరే.. కారం పడకపోతే.. మనకు ముద్ద దిగదు. ముఖ్యంగా తెలుగువారు కారం తినకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. వారు కూడా ఇకపై కారం అంటే ఇష్టంగానే తింటారు. ఎందుకంటే.. కారంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉంటాయి మరి..! ఈ క్రమంలోనే కారం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎండు మిరపకాయల పొడి (కారం)లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువగా తినరాదని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారం.. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సమస్యలను పోగొడతాయని తేలింది.
కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.