జీడిమెట్ల స్మార్ట్గ్రిడ్ ప్రాజెక్టు సందర్శన
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ గ్రిడ్ కంట్రోల్ సెంటర్లో రియల్ టైం డాటా అద్భుతంగా నిర్వహిస్తున్నారని త్రిపుర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ డీ రాధాకృష్ణ కితాబిచ్చారు. ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేసి విజయవంతంగా అమలుచేస్తున్నందుకు ఎస్పీడీసీఎల్, వారి భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావుతో కలిసి త్రిపుర ఈఆర్సీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు బుధవారం హైదరాబాద్ జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్మార్ట్ గ్రిడ్ పనితీరును తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా త్రిపుర ఈఆర్సీ చైర్మన్ మాట్లాడుతూ.. పర్యావరణ హిత పాలసీ విధానకర్తలు ఈ స్మార్ట్ గ్రిడ్ను పరిశీలించాలని, ప్రపంచం యావత్తూ రెన్యూవబుల్ ఎనర్జీ దిశగా పయనిస్తున్న ఈ సమయంలో స్మార్ట్ గ్రిడ్ వల్ల భవిష్యత్తులో దేశీయ పెట్టుబడులకు తగిన రక్షణ లభిస్తుందని చెప్పారు. ఈ స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటుతో విద్యుత్తు పంపిణీ, వినియోగం వ్యవస్థల్లో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించవచ్చని, పైగా దీనిని నెలకొల్పడం, నిర్వహించడం కూడా చాలా సులువని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.