హైదరాబాద్, నందికొండ, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సంతోషంగా ఉన్నారని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగులందరి తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం నల్లగొండ జిల్లా నందికొండలోని విజయవిహార్లో నల్లగొండ జిల్లా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల కోరికలను నెరవేర్చడంలో, రాష్ట్ర నాయకులను ఒప్పించడంలో టీఎన్జీవో సఫలమైందన్నారు. 610 జీవోపై పోరాటాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని నాగార్జునసాగర్ నుంచే ప్రారంభించామని గుర్తుచేశారు.
తాజాగా 33 జిల్లాల్లో చేపట్టే టీఎన్జీవో రాష్ట్ర నాయకుల కృతజ్ఞతా బస్సుయాత్రను కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్రను గుర్తించి సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చారని రాజేందర్ చెప్పారు. రిటైర్మెంట్ వయస్సుతోపాటు, ఈహెచ్ఎస్, సీపీఎస్ ఉద్యోగులకు పింఛన్లు పెంచారని తెలిపారు. 2,80,000 మందిపర్మినెంట్ ఉద్యోగులు, 1,00,080 పెన్షనర్లతోపాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు కలిపి 9,17,749 మందికి వేతన సవరణను అందించేలా టీఎన్జీవో కృషిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు ఏ విధంగా ప్రోత్సాహకాలను అందించిందో.. తాము కూడా అదేస్థాయిలో పనిచేసి మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. టీఎన్జీవో సభ్యత్వ నమోదుతోపాటు.. సంఘాన్ని బలోపేతంచేస్తామని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు.
గన్పార్క్ నుంచి ప్రారంభం
అంతకుముందు హైదరాబాద్లో గన్పార్క్ వద్ద అమరవీరులకు టీఎన్జీవోలు ఘనంగా నివాళులర్పించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ నాయకత్వంలో వివిధ శాఖలకు చెందిన టీఎన్జీవోలు పెద్ద ఎత్తున గన్పార్క్కు చేరుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు. అక్కడి నుంచి 20 కార్ల కాన్వాయ్తో బస్సుయాత్ర ప్రారంభమైంది. మొదటిరోజు బస్సుయాత్ర నాగార్జునసాగర్ వరకు సాగింది. ఇబ్రహీంపట్నం, మాల్, మల్లెపల్లిలో ఉద్యోగులు బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికారు. సాగర్లో ఉద్యోగులు పెద్దఎత్తున స్వాగతించారు. అనంతరం అక్కడ ఉద్యోగులతో కృతజ్ఞతసభ జరిగింది. గురువారం నిడమనూర్ వరకు, 9న కొండ మల్లేపల్లి వరకు బస్సు యాత్ర సాగనున్నది. నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో టీఎన్జీవో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్కుమార్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్వతాలు, నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవి, కోశాధికారి శ్రీనివాస్, నాయకులు జానపాటి రాములు, తాజుద్దీన్ పాల్గొన్నారు.