వాషింగ్టన్ : కరోనా వైరస్ను ప్రపంచ దేశాలకు వ్యాపింపజేసి.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసినా చైనా.. మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షింపజేసింది. చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూమ్మీద కూలే దిశగా ప్రయాణిస్తుందట. ఏప్రిల్ 29న చైనా దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూమిపై కూలే దిశగా ప్రయాణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. పొరపాటున తాత్కాలిక కక్ష్యలోకి ప్రవేశించడంతోనే ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయిందని తెలిపింది.
ఈ నెల 8వ తేదీన(శనివారం) లాంగ్ మార్చ్ రాకెట్ భూ వాతావరణంలోకి వస్తుందని అంచనా వేసింది. రాకెట్ కచ్చితంగా భూమిపై ఎక్కడ పడుతుందో చెప్పలేమని అమెరికా స్పష్టం చేసింది. కొన్ని గంటల ముందే చెప్పగలమని పెంటగాన్ స్పేస్ కమాండ్ సెంటర్ పేర్కొన్నది. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ బరువు సుమారు 21 టన్నులు.
ప్రపంచంలోని అన్ని స్పేస్ ఏజెన్సీలకు సేవలను అందించే ఉద్దేశంతో దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ సమాఖ్యగా ఏర్పడి 20 నవంబర్, 1998లో ఐఎస్ఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, ఐఎస్ఎస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాసా (అమెరికా), రోస్కోస్మాస్ (రష్యా), జాక్సా (జపాన్), ఈఎస్ఏ (ఐరోపా), సీఎస్ఏ (కెనడా) వంటి స్పేస్ ఏజెన్సీలే దాని కార్యకలాపాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. దీంతో చైనా చేపట్టే రోదసి ప్రయోగాలు, ఉపగ్రహాల మరమ్మత్తులు, మానవసహిత యాత్రలపై ఆ దేశాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి తమకు పూర్తి సమాచారం ఇవ్వకుండా చైనా ఏకపక్షంగా ప్రయోగాలు చేస్తున్నదని ఆరోపించాయి. ఇవన్నీ గమనించిన చైనా.. సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నిర్మించుకుంటే తమ ప్రయోగాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించి ‘టియాన్హే’ నిర్మాణానికి సిద్ధమైంది.
357.6 అడుగుల పొడవున్న ఐఎస్ఎస్తో పోలిస్తే ‘టియాన్హే’ సైజు (సుమారు 82 అడుగులు) చిన్నగా ఉన్నప్పటికీ.. సౌకర్యాలు, సేవల విషయంలో ఐఎస్ఎస్కు ఇది ఏ మాత్రం తీసిపోదు. ‘టియాన్హే’ స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం 11 దఫాల్లో రాకెట్ల ద్వారా సామగ్రిని తరలించనున్నారు. అలాగే, కనీసం 12 మంది వ్యోమగాములు దాంట్లో ఉండేందుకు వీలుగా సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వచ్చే ఈ అంతరిక్ష కేంద్రం సాయంతో భవిష్యత్తులో తాము చేపట్టే అంగారక, చంద్ర యాత్రలను పర్యవేక్షించాలని చైనా భావిస్తున్నది.