పెద్దపల్లి, మే 11(నమస్తే తెలంగాణ): న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విచారణ ముగిసింది. ఆయనను సోమవారం అర్ధరాత్రి ఇంటి వద్ద వదిలి వెళ్లిన రామగుండం పోలీసులు మంగళవారం మధ్యాహ్నం కూడా విచారించారు. అనంతరం విచారణ ముగించి ఆయనను పంపించివేశారు. విచారణకు హాజరు కావాలని రామగుండం కమిషనరేట్ పోలీసులు 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వడంతో పుట్ట మధు మధ్యాహ్నం కమిషనరేట్కు వెళ్లారు. దీంతో నాలుగోరోజు కూడా విచారణ కొనసాగింది. కేసుతో సంబంధం ఉన్న, అనుమానితుల బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. వామన్రావు తండ్రి కిషన్రావు ఫిర్యాదుతో మరికొంత మందిని సైతం ప్రశ్నించారు. ఈ కేసు చార్జిషీట్ను ఈ నెల 17న పోలీసులు కోర్టులో సమర్పించనున్నారు.