హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాష్ట్రం అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. సాగునీరు అందక, కరెంటు లేక, పంటలు పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక, కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిత్య విషాద ఘటనలతో తెలంగాణా తల్లడిల్లిపోయింది. సమైక్య పాలకుల వివక్ష, విద్రోహాల కారణంగా తెలంగాణా తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది. ఇవాళ దృశ్యం మారిపోయింది. స్వరాష్ట్రంలో, తెలంగాణా ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదయింది’ అని చెప్పారు.
‘ఒకప్పుడు తెలంగాణ కరువుకాటకాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం అదే తెలంగా ణ 2020-21 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 3.4 లక్షల టన్నుల దిగుబడిని సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయ రంగం సమకూరుస్తున్నది. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది’ అని సీఎం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం, పేదలకు రేషన్ బియ్యం పంపిణీకోసం పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు. కానీ ఈ రోజు తెలంగాణ రైతన్నలు రాష్ట్రానికే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా అవతరించిందన్నారు.
గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు నంబర్ వన్ దిశగా అడుగులు వేస్తున్నది. గతేడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.