బొడ్రాయిబజార్, ఏప్రిల్ 11: సూర్యాపేట జిల్లా కేంద్రం లోని పురాతన రాపోలు దేవాలయంలో జయ, విజయులు ఉన్నందున అది వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం కావచ్చని హైదరాబాద్కు చెందిన పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. రాయప్రోలు కాల క్రమేణ రాపోలుగా మారిందన్నారు. ఆదివారం ఆయన గుడిని సందర్శించారు. ఈ ఆలయంలో శాసనాలేవీ లభించలేదని, ఆలయ చరిత్రపై పరిశోధన చేస్తామని చెప్పారు. ఈ దేవాలయానికి 800 ఏండ్ల చరిత్ర ఉన్నదన్నారు. శాసనపరంగా, స్థానికంగా, ఆలయ వాస్తు శిల్పం ప్రకారం ఆధారాలు సేకరించి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు?, ఈ శైలి దేనికి దగ్గరగా ఉన్నదనేది త్వరలో తేలుస్తామన్నారు. వాస్తు శైలి ఆధారంగా కాకతీయుల అనంతరం రేచర్ల పద్మనాయకులు నిర్మాణం చేసిన ఆలయం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.