బ్లాక్ లిస్టులో చేర్చారనే కోపంతో ఓ రుణగ్రస్తుడికి కోపం వచ్చింది. అంతే.. ఏకంగా ఆ ఫైనాన్స్ సంస్థను కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. సింగిల్గా రంగంలోకి దిగి.. చోరీకి యత్నించి.. అలారం మోగడంతో పారిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్లో చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చెప్పిన మాటలతో పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ ప్రాంతానికి చెందిన ఓ సెంట్రింగ్ మేస్త్రీ చాలా కాలంగా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని ముత్తూట్ ఫైనాన్స్లో బంగారం గిరివి పెట్టి రుణం తీసుకునేవాడు. తిరిగి డబ్బులు చెల్లించి గిరివి విడిపించుకునేవాడు. ఇలా ఓ సారి బంగారం గిరివిపెట్టి వడ్డీ సరిగా కట్టక పోవడంతో సంస్థ అతడి పేరును బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయితే ఇటీవల నిందితుడు రుణం కావాలని ముత్తూట్ ఫైనాన్స్కు వెళ్లగా రుణం ఇవ్వలేదు. ఇదేమిటని ఆరా తీయగా గతంలో మీరు సరిగ్గా వడ్డీ కట్టకపోవడంతో మీ పేరును బ్లాక్ లిస్ట్లో పెట్టామని తెలిపారు. రుణం ఇవ్వడం కుదరని తేల్చి చెప్పారు. గతంలో రుణం తీసుకున్న ప్రతీసారి సరిగానే కట్టానని.. ఒకసారి మాత్రం కట్టలేక పోయానని.. ఆ మాత్రానికే బ్లాక్ లిస్ట్లో పెడుతారా అంటూ సంస్థ సిబ్బందితో వాదించాడు. అయినప్పటికీ రుణం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సంస్థపై కోపం పెంచుకున్న నిందితుడు.. ఎలాగైనా సంస్థను కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నారు. గతంలో అనేక మార్లు ఫైనాన్స్ సంస్థకు వెళ్లిన నిందితుడికి సంస్థ పరిసరాలపై పూర్తి అవగాహన ఉన్నది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిందితుడు నిత్యం పనికి ఉపయోగించే ఓ పెద్ద సుత్తెను తీసుకుని వెళ్లి సంస్థ వెనక వైపు గోడకు రంధ్రం చేశాడు. అందులోనుంచి కార్యాలయం లోపలికి వెళ్లి.. పది నిమిషాల పాటు అందులోనే గడిపాడు. తర్వాత లాకర్ తీసే క్రమంలో అలారం మోగడంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని (సెంట్రింగ్ మేస్త్రీ) పట్టుకున్నారు. అయితే అధికారికంగా ఇక మీడియా ముందుకు తీసుకురావాల్సి ఉంది.