ధర్మపురి, జూన్ 1: చేపల కోసం వల వేస్తే బైక్ చిక్కడం విచిత్రంగా ఉంది కదూ. ఇది నిజమే. ఈ విచిత్ర ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో చోటుచేసుకున్నది. మత్స్యకారుడు గరిగె రాజమల్లయ్య స్థానిక తమ్మళ్లకుంటలో చేపల కోసం వల వేశాడు. ఆ వల.. కుంట లోపల ఉన్న బైక్కు తట్టుకున్నది. ఎంత లాగిన వల రాకపోవడంతో అనుమానం కలిగిన జాలరి.. ఈదుకుంటూ కుంట లోతు ప్రాంతానికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. అక్కడున్న మిగతా జాలర్ల సహకారంతో బైక్ను పైకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి క్రేన్ సహకారంతో బైక్ను బయటకు తీసి స్టేషన్కు తరలించారు. కాగా 8 నెలల క్రితం బైక్ అదుపుతప్పి కుంటలో పడిపోయిందనీ, అప్పట్లో నీరు ఎక్కువగా ఉండటంతో బైక్ను బయటకు తీసే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. బైక్ కోసం ధర్మపురికి చెందిన ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో సంప్రదించాడనీ, పత్రాలను పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ జరిపి సదరు వ్యక్తికి బైక్ అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.