హయత్నగర్, మార్చి 9 : వాణి అంటేనే చదువుల తల్లి. సరస్వతి ప్రతిరూపం వాణీదేవి.. అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మహిళా దినోత్సవం సాక్షిగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని శాసన మండలికి పంపించాలని కోరారు. మంగళవారం రాత్రి చంపాపేట డివిజన్ పరిధిలోని విజయ్ కన్వెన్షన్ హాలులో పట్టభద్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన స్వర్గీయ పీవీ నర్సింహారావు కూతురైన వాణీదేవిని చట్టసభలకు పంపాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించి దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. కేంద్రం మిషన్ భగీరథ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బిహార్, బెంగాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి వాడుకుంటుందని, వారు కూడా అవే పథకాలు చేపడుతామని ప్రజలకు హామీ ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయలేని అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 38600 చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో భూగర్భ జలాలు పెరిగి యాసంగిలో బోర్లు వేసేందుకు బోరుబండ్లకు కూడా గిరాకీ లేకుండా పోయిందన్నారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నారని తెలిపారు. విద్యావంతురాలైన వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఏనాడైనా నియోజకవర్గంలో పర్యటించారా.. అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో గ్యాస్ ధర రూ.300 ఉండేదని, ప్రస్తుతం దాన్ని రూ.900లకు పెంచిందన్నారు. ప్రధాని మోడీ దేశ డీజీపీ పెంచుతామంటే ప్రజలకు అర్థం కాలేదని.. డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడమని ఇప్పుడు అర్థమైందన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, ఎక్కడ, ఎవరికి ఇచ్చిందో తెలుపాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఏడాది పూర్తినాటికి మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ దేవీప్రసాద్, ఏవీఎన్ విద్యాసంస్థల డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, మానస డెయిరీ చైర్మన్ చిర్ర రాజశేఖర్రెడ్డి, డాక్టర్ మనోహర్రెడ్డి, డీఎస్ఆర్ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు రేణు ముఖర్జీ, కె.కల్యాణి, చంద్రకళ, సుభద్ర, శ్రీవాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏవీఎన్ విద్యాసంస్థల అధినేత ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందుతున్నాయని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, విద్యావంతు రాలైన సురభి వాణీదేవిని గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం సంతోషకరమ న్నారు. తాను కూడా పోటీలో ఉందామను కున్నప్పటికీ వాణీదేవిని ప్రకటించడం పట్ల విరమించుకున్నానని తెలిపా రు. ఏవీఎన్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 1200మంది సిబ్బందిని తన సొంత కుటుంబ సభ్యులుగా చూస్తానని, వారందరూ వాణీదేవి గెలుపునకు కృషిచేస్తారని హామీనిచ్చారు.
సికింద్రాబాద్, మార్చి 9 : మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు రుణం తీర్చుకోవడానికి ఓటర్లకు మంచి అవకాశం వచ్చిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి.. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, టీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే దివాకర్రావు, శ్రీకాంత్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్, కార్పొరేటర్లు, తీగుళ్ల కిశోర్ కుమార్ గౌడ్, యువజన విభాగం నాయకులు, రామేశ్వర్గౌడ్, త్రినేత్రగౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, మార్చి 9 : టాక్సీ డ్రైవర్లంతా ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతు తెలుపుతున్నట్లు టాక్సీ సెక్టార్ రాష్ట్ర అధ్యక్షుడు అత్తినమోని నగేశ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టాక్సిసెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజా రాజుయాదవ్, సంపత్రెడ్డి, ఫాహిమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.