హైదరాబాద్, జూలై 5 (నమస్తేతెలంగాణ): వ్యవసాయరంగంలో ఏదైనా చేయాలనే వినూత్న ఆలోచనలు ఉన్నాయా? ఆ ఉత్పత్తులతో వ్యాపారవేత్తగా ఎదగాలనుకొంటున్నారా? రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూట్రిహబ్ సహకారం అందించేందుకు రెడీగా ఉన్నది. దేశంలో పౌష్ఠికాహార లోప నివారణే ధ్యేయంగా పనిచేస్తూ, చదువుకొన్న యువత వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తున్నది. ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రాజెక్టుకు సదుపాయం కూడా కల్పిస్తున్నది. చిరుధాన్యాలతో తయారైన రెడీమేడ్ ఫుడ్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని న్యూట్రిహబ్ను ఏర్పాటుచేశారు. న్యూట్రిహబ్ ఇప్పటివరకు దాదాపు 250 స్టార్టప్లకు సేవలు అందించింది. ఆర్కేవీవై రఫ్తార్ పథకం ద్వారా ఈ ఏడాది 40 స్టార్టప్లకు రూ.3.40 కోట్ల ప్రోత్సాహక ఫండ్ సమకూర్చింది. హబ్ ద్వారా ఇప్పటికే 3 బ్యాచ్లకు శిక్షణ పూర్తయ్యిందని, ప్రస్తుతం నాలుగో బ్యాచ్ కొనసాగుతున్నదని న్యూట్రిహబ్ సీఈవో దయాకర్రావు తెలిపారు.