ఈ రోజుల్లో ప్రమోషన్ సరిగ్గా చేయకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఒకటే.. చిన్న హీరో సినిమా అయినా ఒకటే. ఎంత అద్భుతమైన సినిమా చేసినా.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు తమ సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ ఎలా చేయాలో ఆలోచిస్తుంటారు. ఈ మధ్య జాతిరత్నాలు కేవలం ప్రమోషన్ కారణంగానే అంత పెద్ద బ్లాక్బస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలుకాలేదు. దీనిపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటి వరకు టీజర్, మూడు పాటలు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ సినిమా విడుదలకు ముందు కనిపించాల్సిన సందడి మాత్రం వకీల్ సాబ్ ముందు ఎందుకో మిస్ అవుతుంది. ఇదే అభిమానులను కలవర పెడుతున్న విషయం. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే రిలీజ్కు దగ్గర పడుతున్న సమయంలో తన ప్రమోషన్ ప్లాన్స్ తనకు ఉన్నాయి అంటున్నాడు దిల్ రాజు. పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా ఈయన కూడా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనీవినీ ఎరుగని స్థాయిలో హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు దిల్ రాజు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి విడుదల వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్తో సినిమా రేంజ్ పెంచేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు ఈయన. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా దాదాపు రూ.100 కోట్ల బిజినెస్ చేస్తోంది.