హైదరాబాద్ : క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి ప్రతిష్ఠాత్మక ‘పవర్ ఉమెన్’ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూర్లోని టౌన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్ షెట్టర్ దివ్యారెడ్డికి ఈ అవార్డును అందజేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నది. క్లిమామ్ సహా వ్యపస్థాపకుడు అల్లోల గౌతంరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆవుల్ని సంరక్షించుకోవడంతోపాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందించాలనే సంకల్పంతో అల్లోల దివ్యారెడ్డి క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంతోపాటు స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతోపాటు ఇతర సేవలను క్లిమామ్ అందిస్తుంది. ఐదేండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన క్లిమామ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. క్లిమామ్ పేరుతో దివ్యారెడ్డి అందిస్తున్న సేవలకుగానూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.