సుబేదారి, మార్చి 7 : శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ములుగు, పరకాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్స్టేషన్కు చేరుకోవాలన్నారు. హనుమకొండ బస్స్టేషన్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలంకు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు.
వరంగల్ బస్స్టేషన్ నుంచి చింతల్ బ్రిడ్జి, రంగశాయిపేట, నాయుడు పెట్రోల్ పంపు, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం మీదుగా హనుమకొండ బస్స్టేషన్కు చేరుకోవాలన్నారు. ములుగు రోడ్డు నుంచి కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు అలంకార్ నుంచి కాపువాడ మీదుగా హనుమకొండ బస్స్టేషన్ వైపు వెళ్లాలన్నారు. హనుమకొండ నుంచి వరంగల్ వైపు కార్లు, బైక్లు, ఆటోలు మర్కజీ రోడ్డు, కొత్తూరు జెండా, అమృత్ జంక్షన్ నుంచి యాదవనగర్ ద్వారా పెద్దమ్మగడ్డ నుంచి వెళ్లాలన్నారు. వేయి స్తంభాల ఆలయం వద్ద, అమృత్ జంక్షన్ నుంచి అలంకార్ వరకు రోడ్డుపై వాహనాల పార్కింగ్కు అనుమతి లేదన్నారు. ప్రయాణికులు, వాహనదారులు, భక్తులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.