హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశారు. ఎవరికైనా సందేహాలుంటే 040-27852482, 9490598985, 9010303626 నంబర్లలో సంప్రథించవచ్చని అధికారులు తెలిపారు.
గణేశుని విగ్రహాలను తరలించే వాహనాలకు ప్రత్యేకంగా కలర్ కోడింగ్ ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు రూట్మ్యాప్ను సిద్ధం చేశారు. ట్రాఫిక్ రద్దీని గూగుల్ మ్యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తిచేసింది.
నిమజ్జనం నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసి బస్సులను నగర శివార్లకే పరిమితం కానున్నాయి. నల్లగొండ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎల్బీనగర్, వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్, దేవరకొండ నుంచి వచ్చే వాహనాలు సాగర్ రింగ్రోడ్డు, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి వచ్చే వాహనాలను ఆరాంఘర్ వద్ద నిలిపివేయనున్నారు. ఇక అంతర్ రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై శనివారం అర్థరాత్రి నుంచే నిషేధం విధించనున్నారు.
ఆదివారం జరుగనున్న గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని పేరొన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ శోభాయాత్రకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి సుమారు 19 వేల మంది వివిధ స్థాయిల్లోని పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని, ప్రతి క్రేన్ వద్ద, ప్రతి విగ్రహం వెంట ఒక పోలీసు అధికారిని నియమిస్తామని చెప్పారు.
వాహనదారులు, భక్తులకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయంతో ట్రాఫిక్ డైవర్షన్కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 6 వద్ద హుస్సేన్సాగర్లో పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి ఆర్టీఏ ఆధ్వర్యంలో వెయ్యి వాహనాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనవారు వినియోగించుకోవాలన్నారు. వాహనాల పర్యవేక్షణకు 10 మంది ఆర్టీఏ అధికారులు, 50 మంది మోటార్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించినట్లు మంత్రి చెప్పారు.