కమలాపూర్, జూలై 28: హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి స్వర్గం రవి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినట్టు చెప్పారు. నియోజకవర్గంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై తాను కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్టు తెలిపారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అనుచరులతో శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. రాబోయే ఉపఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.