ఓదెల, జూలై 7: పల్లె ప్రగతి పనుల పరిశీలనకు రాష్ట్ర అధికారుల బృందం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకను సందర్శించింది. మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే పల్లెనిద్ర చేశారు. బుధవారం ఉదయం కాలినడకన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్, డంప్యార్డు, వన నర్సరీ, హరితహారంలో భాగంగా గుట్టల్లో పెంచుతున్న జామతోటలను పరిశీలించారు. దళితకాలనీకి వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్ సురేశ్బాబు, ఎస్బీఐ ఐఈసీ నిపుణుడు శ్యాంకుమార్ దళితకాలనీలో ఓ ఇంటిలో విరగగాసిన జామచెట్టు వద్దకు వెళ్లి పండ్లను రుచిచూశారు. గ్రామంలో చేపట్టిన పనులు బాగున్నాయని పాలకవర్గాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా పల్లె ప్రకృతివనాన్ని 60 రకాల మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని అభినందించారు. డాక్యుమెంటరీని రూపొందించాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చూసి పారిశుధ్యం, మొక్కల పెంపకం, చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఇక్కడ జడ్పీ డిప్యూటీ సీఈవో మచ్చ గీత, డీపీవో చంద్రమౌళి, డీఎల్పీవో దేవకీదేవి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సర్పంచ్ మ్యాడగోని భాగ్యమ్మ, ఎంపీటీసీ నోముల పద్మావతి, ఉపసర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు.
సాంబయ్యపల్లి సందర్శన..
సుల్తానాబాద్రూరల్, జూలై 7: మండలంలోని సాంబయ్యపల్లి గ్రామాన్ని బుధవారం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సందర్శించారు. నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపిన వన సేవకులను అభినందించారు. శ్మశానవాటికను సందర్శించి పనులు జరుగుతున్న తీరును ఆరా తీశారు. అనంతరం హనుమాన్ ఆలయ సమీపంలో మొక్కలు నాటారు. తడి పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో పర్యటించి ఇంకుడుగుంతల నిర్మాణాలు, రోడ్లు, మురుగు కాలువలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, మండల ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, ఎంపీడీవో శశికళ, సర్పంచ్ బాపిరెడ్డి, ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్, పీఆర్ఏఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శి పాపయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.