హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మరాఠ్వాడ పరిసరాలపై సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లవరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, తూర్పు- పశ్చిమ ఉపరితల ద్రోణి ఆదివారం బలహీనపడగా, శనివారం ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయివరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, బలపడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి సోమవారం నాటికి తుఫాన్గా మారనున్నది. తరువాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్గా మారుతుందని, 26న సాయంత్రం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో జోగులాంబ గద్వాల, నల్లగొండ, వనపర్తి, మహబూబ్నగర్, అదిలాబాద్ జిల్లాల్లోని దాదాపు 20 ప్రాంతాల్లో తేలిక పాటినుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.
అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపూర్లో 4.63, నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో 3.75, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 3.38, నారాయణపేట జిల్లా నార్వలో 3.18, మహబూబ్నగర్లో 2.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాయవ్య, పశ్చిమ దిశల నుంచి బలమైన కిందిస్థాయి గాలులు తెలంగాణ మీదకు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. దక్షిణ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వర్షాలు కాస్త తగ్గటంతో పగటి ఉష్ణోగ్రత ఆదివారం 43 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలో 20కి పైగా ప్రాంతాల్లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం థంగులలో 43.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.