సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్ల క్రితం సినీరంగాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. ఈ కేసులో ఆబ్కారీశాఖలోని సిట్ అధికారులు దాఖలుచేసిన చార్జిషీట్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కెల్విన్ మాస్కెరాన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖుద్దూస్లను డ్రగ్స్ సరఫరా కేసులో 2017 జూలై 2న ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పలువురితోపాటు సాఫ్ట్వేర్ నిపుణులు, విద్యార్థులకు మత్తు పదార్ధాలు సరఫరా చేసినట్లు నిందితులు ఈ కేసు విచారణ సందర్భంగా వెల్లడించారు. దీంతో మరింత లోతైన దర్యాప్తు కోసం ఆబ్కారీశాఖ సిట్ను ఏర్పాటుచేసింది. పలువురు సినీ హీరోలు, హీరోయిన్లతో పాటు ఇతర ప్రముఖులను ఆబ్కారీ శాఖ కార్యాలయానికి రప్పించి విచారించారు. 30 మందిని అరెస్టు చేసి, మరో 27మందిని విచారించారు. మొత్తం 12కేసులు నమోదు చేయగా అందులో 8 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. త్వరలోనే డ్రగ్స్ కేసు వ్యవహారంపై న్యాయ విచారణ ప్రారంభం కానుంది.