నగరంలో కరోనా ఉధృతి నియంత్రణలోకి వస్తున్నది. వైరస్వ్యాప్తి తగ్గుతుండగా, బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. లాక్డౌన్, ఇంటింటికీ ఫీవర్ సర్వే, మందుల కిట్ల పంపిణీతో మహమ్మారికి మూకుతాడు పడుతున్నది. గత నెలలో ఒక్కసారిగా బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్ల కోసం పేషెంట్లు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొవిడ్కు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. టెస్టుల సంఖ్యను బాగా పెంచింది. ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న వారిని గుర్తించి.. మందుల కిట్లు అందజేస్తుండడంతో హోం ఐసొలేషన్లలోనే వైరస్ కట్టడవుతున్నది. దీనికితోడు లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంతో జనం బయట తిరగడం తగ్గిపోయింది. ‘స్టే హోం..స్టే సేఫ్’ సూత్రాన్ని పాటిస్తుండటంతో పాజిటివిటీ రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నది. కాగా, లాక్డౌన్కు ముందు కొండాపూర్లోని జిల్లా దవాఖానలో బెడ్లు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సుమారు 90 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. 110 బెడ్లలో కేవలం 15 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.
కొండాపూర్, మే 31: కొవిడ్-19 మహమ్మారి ఈసారి ప్రపంచ దేశాలేమో కాని, భారతావనిపైనే అధికంగా ప్రభావం చూపింది. అయితే, దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత నెలలో దవాఖానల్లో పడకలు దొరకక ఇబ్బందులకు గురవ్వగా, ప్రస్తుతం, ఇన్ పేషెంట్లు లేక పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, ప్రభుత్వ దవాఖానల్లో అందజేస్తున్న మెరుగైన వైద్య సౌకర్యాలతో కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఎంతో మేలు చేకూరుతున్నదని వైద్యులు చెబుతున్నారు. జ్వర సర్వేలో కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి, అక్కడే కరోనా కిట్స్ అందజేసి జాగ్రత్తలు తెలుపుతుండటంతో దవాఖాన అవసరం లేకుండానే ఇంట్లోనే వైరస్ కట్టడవుతున్నది. దీంతో పాటుగా వైరస్ వ్యాప్తి సైతం అదుపులోకి వస్తున్నది. కాగా, లాక్డౌన్కు ముందు కొండాపూర్లోని జిల్లా దవాఖానలో పడకలు ఖాళీలు లేక పేషెంట్లను గాంధీ, టిమ్స్కు పంపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం, పేషెంట్లు లేక దాదాపు 90శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో 110 పడకలు కొవిడ్ వైద్యం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో కొవిడ్ జనరల్ బెడ్స్ 10, ఆక్సిజన్ బెడ్స్ 62, ఐసీయూ బెడ్స్ 10, వెంటిలేటర్ బెడ్స్ 28 అందుబాటులో ఉండగా, వీటిలో కేవలం 15 మంది ఆక్సిజన్ జనరల్ బెడ్స్లో చికిత్స పొందుతున్నారు. కాగా, దవాఖానలో ప్రస్తుతం వెంటిలేటర్, ఐసీయూ, జనరల్తో కలిపి 95 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి.