ముంబై: ఇంటర్మీడియట్ అర్హతతో యువత భారత సైన్యంలో చేరడానికి అవకాశం ఉంది. 10 + 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరితే ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించడంతో పాటు మంచి జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. తాజాగా టెక్నికల్ ఎంట్రీ లెవెల్తో ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థుల ఎంపిక విధానంలో సైన్యం మార్పులు చేసింది.
టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు ఇకపై తప్పనిసరిగా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్( జేఈఈ) మెయిన్స్ను కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి తర్వాత ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలను భారత సైన్యం మార్చింది.
ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో 10+2 పరీక్షలో అర్హత సాధించాలి. ఈసారి అదనంగా జేఈఈ మెయిన్ ఉత్తీర్ణతను అర్హత జాబితాలో చేర్చారు. ఎంట్రెన్స్ టెస్టులో పాస్ అయినవారికి శిక్షణా అకాడమీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన క్యాడెట్లను లెఫ్టినెంట్గా నియమిస్తారు.