గువాహటి: అసోంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా నెగెటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ‘ఇతర రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే ప్రయాణికులంతా ఏడు రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందే. ప్రయాణానికి ముందు చేయించుకున్న కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా క్వారంటైన్కు వెళ్లాల్సిందేనని’ స్పష్టం చేసింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ప్రయాణాలు చేసే ప్రభుత్వ అధికారులు, మరణాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు దీనిని నుంచి మినహాయింపు ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ సర్మ తెలిపారు.
అసోంలో నిన్న కొత్తగా 1665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 9048 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ కోటి డోసులకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మూడోవిడుత టీకా పంపిణీ కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభంకానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..