లక్ష దాటిన వ్యాక్సినేషన్
రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా రిజిస్ట్రేషన్
నిర్మల్ అర్బన్ , ఏప్రిల్ 26 : కొవిడ్ వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొదటి డోస్ 1,01,796 మందికి వ్యాక్సిన్ వేయగా, రెండో డోసు 7743 మందికి అందించినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ టెస్టులను పెంచడంతో పాటు అంతకంటే రెట్టింపు వేగంతో వ్యాక్సిన్ను ప్రజలకు అం దించి కరోనా బారిన పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో కొవిడ్ వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 23 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేపట్టగా మూడు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా కదిలివస్తూ టీకాలు వేసుకుంటున్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని సెలవు రోజుల్లో సైతం ప్రజలకు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్పై కళాజాత బృందాలు,పీహెచ్సీ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రతి ఒక్కరూ టీకా వేసుకుంటున్నారు.
జిల్లాలో 1,00,796 మందికి టీకా..
నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,00,796 మందికి టీకాలు అందించారు. ఇందులో ఫ్రంట్లైన్ వారియర్తో పాటు ప్రైవేట్ వైద్యశాలల సిబ్బందికి వ్యాక్సినేషన్ చేశారు.మొదటి దశలో ఫ్రంట్లైన్ వారియర్, రెండో దశలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 45-60 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేశారు. మూడో దశలో 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందుకు గాను ఈనెల 28 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రతి రోజూ సగటున 5 వేల మందికి టీకా అందిస్తున్నారు.
రేపటి నుంచి రిజిస్ట్రేషన్
ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ శనివారం నుంచి టీకా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి టీకా రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించనుంది. జిల్లాలోని 23 ప్రభుత్వ పీహెచ్సీలతో పాటు 3 ప్రైవేట్ వైద్యశాలల్లో యువకులకు టీకా అందించనున్నారు. ఇందుకోసం కొవిడ్ పోర్టల్ www. cowin.gov.in లో లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొబైల్కు ఓటీపీ వస్తుంది.ఓటీపీని నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయాలి. గుర్తింపు కార్డు, వయసు,నమోదు చేసి రిజిస్టర్ బటన్ను క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం కాగానే టీకా ఎక్కడ తీసుకుంటారో వివరాలు నమోదు చేయాలి. టీకా తీసుకునే కేంద్రాన్ని ఎంచుకోవాలి. ఆ వివరాలను నమోదు చేయగానే అపాయింట్ మెంట్ వివరాలతో ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో టీకా తీసుకునే కేంద్రానికి వెళ్లాలి.
ఏర్పాట్లు చేస్తున్నాం
వచ్చేనెల నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ టీకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో దాదాపు 3.50 లక్షల మంది జనాభా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో టీకా కొరత లేదు. అందరికీ మొదటి, రెండో డోసుకు సరిపడా టీకాలను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటి వరకు లక్ష మందికి మొదటి డోసు టీకా పంపిణీని పూర్తి చేశాం.రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరుగనుంది.
-ధన్ రాజ్, జిల్లా వైద్యాధికారి