హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ శుక్రవారం జరుగనున్నది. దీంతో 30 రోజుల ముస్లింల ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించిందని, ముస్లిం ప్రజలు శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు జరుపుకోవాలని హిలాల్ కమిటీ, మత ప్రముఖులు పిలుపునిచ్చారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్ కారణంగా సామూహిక ప్రార్థనలకు వెళ్లకుండా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మతపెద్దలు సూచించారు. మసీదులో నలుగురు ముస్లిం పెద్దలు మాత్రమే ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం.