రాజోళి/అమరచింత, ఆగస్టు 6 : రాజోళిలో 850 కుటుంబాలకు పైగా నేత కార్మికులు నివసిస్తుండగా 720కి పైగా జియో ట్యాగ్ కలిగిన వారున్నారు. రాజోళిలో చేనేత కార్మికులు గద్వాల పట్టు చీరలు, పైతాని రకం, బ్రోకేట్, టర్నింగ్ చీరల తయారీ ఎక్కువగా చేస్తారు. రాజోళి నుంచి ప్రతి ఏడాది జాతీయ చేనేత పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. గత వారంలో 1,800 కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేసిన నేతన్న బీమా పథకం ద్వారా లబ్దిదారులకు భీమ బాండ్లను ఎమ్మెల్యే అబ్రహం పంపీణి చేశారు.
అమలవుతున్న పథకాలు..చేనేత మిత్ర
ప్రభుత్వం నేతన్నలకు చేనేత మిత్ర పథకంలో భా గంగా నూలు, రంగులు, రసాయనాలకు 40శాతం రాయితీతో ఇస్తూ, డీబీటీ పద్ధతిన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేస్తూ సహకారం అందిస్తున్నది.
నేతన్నకు చేయుత..
తెలంగాణ ప్రభుత్వం (హ్యాండ్లూమ్ వివర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీం)నేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకం. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా చేనేత పరిశ్రమలు జియో ట్యాగింగ్ ద్వారా ఎంపిక చేసి, తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద నిధులు పొదుపు చేసుకోవచ్చు. ఈ పధకం ద్వారా నేత కార్మికులు డిజైనర్స్, డయర్స్, వార్పింగ్, వైండింగ్, బ్లీచింగ్, రోలింగ్, విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.
అర్హులకు అందిస్తున్నాం
ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న రేషన్ సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్, చేనేత మిత్ర, నేతన్న బీమా పథకాలను అర్హులకు అందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి జిల్లాలో మొత్తం 950 మగ్గాలు ఉండగా, ఇప్పుడు 1,350 మగ్గాలు ఉన్నాయి. ఒక మగ్గానికి ముగ్గురు చొప్పున 4,150 మంది కార్మికులు సంక్షేమ పథకాలను పొందుతున్నారు.
– గోవిందయ్య, జౌళీశాఖ ఏడీ
బీమా పథకం..
చేనేత కుటుంబాలకు అండగా నేతన్న బీమ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. 18-59 ఏండ్ల వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. రాజోళిలో 1,800మంది కార్మికులకు నేతన్న బీమ బాండ్లను గతవారంలో ఎమ్మెల్యే అబ్రహం అందజేశారు.