హన్మకొండ, జూన్ 24 : యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప ఆలయానికి చోటు కల్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం, కల్చరల్, యువజన సర్వీసులు, క్రీడ లు, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కూడిన బృందం గురువారం ఢిల్లీలోని శాస్త్రీభవన్లో సాంస్కృతిక, పర్యాటక మం త్రిత్వ శాఖ అధికారులు, భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్ను కలిశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో రాష్ర్టానికి సంబంధించి పెండింగ్ నిధుల మంజూరుపై బృందం ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలోని స్మారక చిహ్నాలు, కోటల అభివృద్ధి పనులు చేపట్టాలని, వరంగల్, కరీంనగర్లోని మ్యూజియాల ఆధునీకరణకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కోరారు. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాల పునురుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా మం త్రులు మాట్లాడుతూ ప్రపంచ పటంలో రాష్ట్ర వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రతినిధి బృందం లో ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కార్యదర్శి ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డీజీ విద్యావతి ఉన్నారు.