హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉద్యోగి సంబురాలు చేసుకున్నాడు. టీజీవో, టీఎన్జీవో కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. 30 శాతం ఫిట్మెంట్ అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగవర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. అన్నిశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతోపాటు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రపటానికి క్షీరాభిషేకాలుచేశారు. ఫిట్మెంట్తో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 9.5 లక్షల మంది ఉద్యోగులకు జూన్ నెల నుంచి వేతనాలు పెరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ వేతనాలు పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ఉద్యోగులు పేర్కొన్నారు. తమను కన్నబిడ్డలుగా చూసుకొంటున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని ఉద్యోగసంఘాల నేతలు ప్రకటించారు.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుతోపాటు ఇతర డిమాండ్లన్నింటినీ పెద్ద మనసుతో అంగీకరించిన సీఎం, మంత్రులకు టీజీవో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సంఘం అధ్యక్షురాలు వీ మమత తెలిపారు. బుధవారం టీజీవో కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్యోగులను తమ సొంత బిడ్డలుగా చూసుకొంటున్నారని తెలిపారు. ఉద్యమంలో ఉద్యోగులంతా కేసీఆర్ వెన్నంటే ఉన్నారని.. బంగారు తెలంగాణ సాధనలోనూ ఆయన వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు. మమత మాట్లాడుతూ.. 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ జీవోల విడుదలకు ఆమోదం తెలిపినందున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంకోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతిరోజూ గంట అదనంగా విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో టీజీవో ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణ, సహధ్యక్షుడు సహదేవ్, రవీందర్రావు, నగరశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, అరుణ్కుమార్, సుజాత, వెంకటయ్య, ప్రణయ్కుమార్, సబిత పాల్గొన్నారు.
కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చినమాట తప్పకుండా పీఆర్సీ అమలుకు ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ వేతనాలు పెరుగుతాయని చెప్పారు. ఉద్యోగుల మరో సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు రవీందర్కుమార్, ప్రధానకార్యదర్శి నర్సింగ్రావు, నాయకులు శ్రీకాంత్రావు, డాక్టర్ ఎండీ షరీఫ్, హరీశ్రెడ్డి లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులందరూ అహర్నిశలు కష్టపడుతూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్నాథం ప్రవీణ్ ఒకప్రకటనలో తెలిపారు. కేజీబీవీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 180 రోజు ల మెటర్నిటీ సెలవులు ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సహా పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ ముకురాల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి బీ జ్ఞానేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న సీఎం కేసీఆర్ సంకల్పం మరోసారి రుజువుచేస్తూ ఈ నెల నుంచే వేతన సవరణ అమలుకు ఆదేశాలు ఇవ్వడం హర్షణీయమని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షు డు మన్నె ప్రభాకర్, కార్యవర్గసభ్యులు కే నిరంజన్రావు, బాణాల రాంరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులందరి తరఫున ధన్యావాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 9.5 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరిగేలా పీఆర్సీ అమలుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్, మంత్రివర్గ సభ్యులకు టీఎన్జీవో కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వక ఉంటూ గత ఏడేండ్లుగా అనేక సమస్యలను పరిషరిస్తూ వస్తున్నదని తెలిపారు. తాజాగా 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ జీవోలు విడుదల చేయాలని ఆదేశించడం, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు రాష్ట్రం లో పనిచేస్తున్న 9.5 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నదని కొనియాడారు. భవిష్యత్లో మరింతగా ప్రజలకు సేవలు అందిస్తూ బంగారు తెలంగాణ సాధనకు అంకితభావంతో పనిచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, శ్రీరామ్, శ్రీకాంత్, శైలజ, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌస్, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముజీబ్ నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు కేక్ కట్ చేసి.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.