హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో నేతలు ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ఆయన అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విధివిధానాలను త్వరగా రూపొందించి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని కోరినట్టు వెల్లడించారు. ఆదాయం పన్ను రాయితీని రూ. 2.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలను ఆదేశించినట్టు చెప్పారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన స్థలాన్ని త్వరలో ఉద్యోగులకు కేటాయించే అంశంపై కూడా సీఎం సానుకూలంగా స్పందించారన్నారు.
సీఎంను కలిసినవారిలో సంఘం నేతలు మామిళ్ల రాజేందర్, ప్రతాప్, ముత్యాల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి తదితరులున్నారు. అనంతరం టీఎన్జీవో నేతలు పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, సురేశ్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులను కలిశారు.